అరుణోదయ రామారావు
అరుణోదయ రామారావు (విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి)
అరుణోదయ రామారావు విప్లవ సాంస్కృతోద్యమనేత, కళాకారుడు, ప్రజా గాయకుడు, కవి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపక కార్యదర్శి, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు. అతను వామపక్ష గీతాలను పాడుతూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. అరుణోదయ సంస్థ పేరునే రామారావు తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. 40 ఏళ్లుగా వామపక్ష ఉద్యమాల్లో క్రియాశీలపాత్ర పోషించాడు. ప్రజా సమస్యలను పాటల రూపంలో జనాల్లోకి తీసుకెళ్లేవాడు.
అరుణోదయ రామారావుగా సుపరిచితుడైన కళాకారుడు రామారావు కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లిలోని దళిత కుటుంబంలో జూలై 1, 1955న జన్మించాడు. బియస్సీ వరకు విద్యాభ్యాసం చేసాడు. అతను ఐ.ఎఫ్.టిఉ.యు రాష్ట్ర నాయకురాలైన అరుణను వివాహమాడాడు. వారికి చైతన్య, రాహుల్ అనే కుమారులున్నారు. అతను అఖిల భారత సాంస్కృతిక కళాకారుల సంఘం కన్వీనర్గా, అరుణోదయ సాంస్కృతిక కళాకారుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా తన సేవలనందించాడు. అతనికి 1974లో విరసం మహాసభల సందర్భంగా కానూరి వెంకటేశ్వరరావుతో పరిచయం లభించింది. కానూరి వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటైన అరుణోదయ సాస్కృతిక సమాఖ్యకు రామారావు కార్యదర్శిగా పనిచేశాడు. భారతదేశ ఎమర్జెన్సీ సమయంలో ఎన్కౌంటర్ కాబడ్డ రామనరసయ్య స్మారకంగా “అన్న అమరుడు రా.. వీరగాథలు పాడరా.. విప్లవ వీర చరితలు పాడరా.. శ్రీకాకుళ గిరిజన పోరాట పాటలు.. గోదావరి లోయ పాటలు” తదితర ఉద్యమ గీతాలను ఊరూరా తిరిగి ప్రచారం చేశాడు. తెలంగాణ మలిదశ పోరాటంలోనూ పాటలలో ఉద్యమాన్ని చైతన్యపరిచాడు.
1973లో “పల్లెటూరి కూలి రైతా…నీ పిల్లా జల్లా చల్లగా ఉన్నారా?” అనే పాటను మొదటి సారిగా పాడాడు.
అతను అనంతపురంలో బియస్సీ చదువుతున్న రోజుల్లో కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అతను పాడిన పాటలకు ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ముగ్దుడై అతనిని చెన్నె తీసుకుని వెళ్ళాడు. సంగీత దర్శకుడు పుహళేంది వద్ద శిక్షణనిప్పించాడు. అతను రాసిన “జోహారులు…హోహారులు” పాటను శ్రీరాములయ్య సినిమాకు తీసుకున్నారు.
అతను గుండెపోటుతో హైదరాబాదులో మే 5, 2019న మరణించాడు.
మాధవి కాళ్ల