ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్
ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ (జూన్ 6, 1877 – జూన్ 15, 1949) మలయాళ కవి, సాహిత్యకారుడు. మలయాళ సాహిత్యరంగంలో ఆధునిక యుగారంభంలోని ముగ్గురు మహాకవుల్లో ఒకరుగా ఆయన ప్రశస్తి పొందారు. (మిగిలిన ఇద్దరు – కుమారన్ ఆశాన్, వళ్ళత్తోళ్ నారాయణ మీనన్).
ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్ మధ్య తిరువాన్కూర్ రాజ్యం (ప్రస్తుతం కేరళ రాష్ట్రంలోని ఆలెప్పీ జిల్లా) లో చంగనాచేరి సమీపంలోని పెరున్న గ్రామంలో 1877 జూన్ 6న జన్మించారు. 19వ శతాబ్ది నాటికే వందల సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి ఉత్తర కేరళకు చెందిన కణ్ణూర్ జిల్లాలో వారి వంశంలో పూర్వీకులు స్థిరపడ్డారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కోలత్తిరి రాజవంశాన్ని సేవిస్తూ రాజధాని చిరక్కల్లో జీవించేవారు. ఆపైన ఆ వంశస్థుల్లో ఒకరు తిరువన్కూరుకు వలసవచ్చి, తిరువనంతపురం నగరానికి 4 మైళ్ళ దూరంలోని ఉళ్ళూర్ గ్రామంలో స్థిరపడ్డారు. తిరువాన్కూరు మహారాజులను సేవిస్తూ పలుమార్లు ఈ వంశస్థులు చరిత్రకెక్కారు.
వీటన్నిటి నేపథ్యంలో పరమేశ్వర అయ్యర్ తన స్వగ్రామమైన పెరున్నను వదిలి పూర్వీకుల గ్రామమైన ఉళ్ళూర్ ని తన కలంపేరుగా స్వీకరించారు. ఆయన జన్మనామం సాంబశివన్, అయితే క్రమంగా ఆయనకు పరమేశ్వరన్ అన్న ముద్దుపేరు ఏర్పడి అదే ఖాయమైంది. ఆయన తండ్రి సుబ్రహ్మణ్య అయ్యర్ చక్కటి పండితుడు. ఐతే కుటుంబభారం కారణంగా ప్రభుత్వ పాఠశాలలో మలయాళ భాష ఉపాధ్యాయునిగా ఉద్యోగం ప్రారంభించి క్రమంగా ఉద్యోగోన్నతి పొందుతూ పాఠశాలల మీద అసిస్టెంట్ ఇన్స్పెక్టరుగా పనిచేశారు. ఆయన మరణించేంతవరకూ అదే ఉద్యోగంలో కొనసాగారు.
మాధవి కాళ్ల