రావూరి భరద్వాజ
రావూరి భరద్వాజ (జూలై 5, 1927 [2] – (అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత. రావూరి భరద్వాజ 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు. సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో జీవన సమరం మరో ప్రముఖ రచన.
తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.
వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మోగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. 1946లో నెల్లూరులోని జమీన్ రైతు వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు.1948లో దీనబంధు వారపత్రికకు బాధ్యుడుగా ఉన్నాడు. జ్యోతి,సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్మన్గా పనిచేశాడు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు.
ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.
రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి వారి రచనల గురించి సమగ్రమైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకలనాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు. భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడును 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసినచెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశాడు.
విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది. పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది.
ఇతని వివాహం 1948 మే 28 తేదీన శ్రీమతి కాంతం గారితో జరిగింది. వీరికి ఐదుగురు సంతానం: రవీంద్రనాథ్, గోపీచంద్, బాలాజీ, కోటీశ్వరరావు, పద్మావతి. ఇతని భార్య1986 ఆగస్టు 1వ తేదీన పరమపదించింది.
రావూరి భరద్వాజ 2013 అక్టోబరు 18న తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.
రావూరి భరద్వాజను నిలబెట్టే రచనల్లో అతి ముఖ్యమైనది చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశారు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే రాసిన ‘పాలపుంత’ అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా రాశారు. మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రికలో ధారావాహికగా వెలువడిన పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరగడం విశేషం.
రావూరి భరద్వాజ సుమారు 150 రచనలు చేశాడు.
కథా సంకలనాలు
అపరిచితులు
అపశ్రుతి
ఆనాడు
అర్థాంగి
ఆహుతి
భాగేశ్వరి
కథావాహిని
నవలలు
కరిమింగిన వెలగపండు (1962)
జలప్రళయం (1963)
పాకుడురాళ్ళు (1965)
చంద్రముఖి
కాదంబరి
చిత్రగ్రహం
ఇదంజగత్ (1967)
పిల్లల కోసం
ఉడుత ఉపదేశం
కీలుగుర్రం
చిలుక తీర్పు
జాలిగుండె
తెలివైన దొంగ (పిల్లల కథలు)
పద్దు తెచ్చిన ముద్దు తమ్ముడు (పిల్లల కథలు)
అపరాధ పరిశోధన
విషనాగు
దుష్టచతుష్టయం
సత్యాన్ని దాచటం సాధ్యంకాదు
ఎత్తుపల్లాలు
మంచుమనిషి
సాహిత్య వ్యాసాలు
ఇనుపతెర వెనుక
కంచికి వెళ్ళిన కథ
నేనెందుకు రాస్తున్నాను
మహాతి
మొగ్గతొడిగిన ఎర్రగులాబి
శూన్యం నుండి సృష్టి
స్మృతి సాహిత్యం
అంతరంగిణి
అయినా ఒక ఏకాంతం
ఐతరేయం
ఒకింత వేకువకోసం
నాలోని నీవు
విజ్ఞాన సాహిత్యం
అచ్చు ముచ్చట
అద్దం కథ
అవని-ఆకాశం
గడియారం
గ్రహాలు
చెత్త నుండి విత్తం
నిప్పు కథ
అవార్డులు
రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.
1980 – కళాప్రపూర్ణ – ఆంధ్ర విశ్వవిద్యాలయం.
1983 – కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
1985 – సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనకకు లభించింది.
1987 – రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
1987 – తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు.
1997లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం.
మాధవి కాళ్ల