శ్రీయుక్తేశ్వర్ గిరి(ఆధ్యాత్మిక గురువు. ది హోలీ సైన్స్ రచయిత)

శ్రీయుక్తేశ్వర్ గిరి (మే 10, 1855 – మార్చి 9, 1936) ఒక ప్రముఖ ఆధ్యాత్మిక గురువు. ఈయన ఒక యోగి ఆత్మకథ రాసిన పరమహంస యోగానందకు గురువు. ఈయనకు గురువు లాహిరి మహాశయులు.

యుక్తేశ్వర్ జన్మనామం ప్రియానాథ్ కరార్. మే 10, 1855లో బెంగాల్ ప్రావిన్సు లోని సీరాంపూర్ లో క్షేత్రనాథ్ కరార్, కాదంబిని దంపతులకు జన్మించాడు. ఈయన చిన్నవయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు, భూమి తాలూకు వ్యవహారాలు చూసుకోవలసి వచ్చింది. చదువులో మంచి ప్రతిభ కనబరచిన ఈయన ప్రవేశ పరీక్షలో మంచి మార్కులు సంపాదించి శ్రీరాంపూర్ క్రిస్టియన్ మిషనరీ కళాశాలలో సీటు సంపాదించాడు. అక్కడ ఉండగానే బైబిల్ పై ఆసక్తి కలిగింది. ఈ ఆసక్తి వల్ల ఈయన తర్వాత రాసిన ది హోలీ సైన్స్ అనే పుస్తకంలో యోగా, బైబిల్ ను సమన్వయం చేస్తూ కొంత శాస్త్రీయమైన వివరణలు ఇచ్చాడు. కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కలకత్తా వైద్య కళాశాలలో రెండు సంవత్సరాల పాటు చదివాడు.

కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయనకు వివాహమై ఒక కూతురు జన్మించింది. తర్వాత కొన్నేళ్ళకు భార్య మరణించింది. తర్వాత కొన్నేళ్ళకు ఈయన శ్రీ యుక్తేశ్వర్ గిరి అనే పేరుతో సన్యాసాశ్రమం స్వీకరించాడు.

1884లో లాహిరి మహాశయులు ఈయనకు క్రియాయోగ దీక్షనిచ్చి తన శిష్యుడిగా చేర్చుకున్నాడు. తర్వాత తరచుగా బెనారస్ లో తన గురువును కలుస్తూ కొన్ని సంవత్సరాలు గడిపాడు. 1894లో ఈయన అలహాబాదులో కుంభమేళా జరుగుతున్న సమయంలో తన పరమ గురువైన (లాహిరీ మహాశయుల గురువు) మహావతార్ బాబాజీని కలుసుకున్నాడు. బాబాజీ ఈయనను హిందూ పురాణాలను, బైబిల్ ను సమన్వయం చేస్తూ పుస్తకాలు రాయమని ప్రేరేపించాడు. స్వామి అనే పేరును కూడా ఆయనే చేర్చాడు. శ్రీ యుక్తేశ్వర్ ఈ పుస్తకాన్ని 1894 లో కైవల్య దర్శనం (ది హోలీ సైన్స్) అనే పేరుతో విడుదల చేశాడు.

ఈయన ఆంగ్లం, ఫ్రెంచ్, బెంగాలీ, హిందీ ధారాళంగా మాట్లాడేవాడు. సంస్కృతంలో కూడా మంచి పరిజ్ఞానముండేది. ఆంగ్లం, సంస్కృత భాషలను సులభంగా నేర్చుకోవడానికి తాను స్వయంగా రూపొందించిన బోధనా పద్ధతులను విద్యార్థులకు వివరించేవాడు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *