తెలంగాణ వీరుడు.
కొమరం భీం
కొమరం భీం తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుల్లో ముఖ్యులు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఆదివాసీ ప్రజల హక్కుల కోసం పోరాడిన వీరుడు. గోండు తెగలో జన్మించిన కొమరం భీం, నిజాం ప్రభుత్వాన్ని ఎదుర్కొని, "జల్ జంగల్ జమీన్" అనే నినాదంతో ఆదివాసీల ఆత్మగౌరవ పోరాటానికి రూపకర్తగా నిలిచాడు. అతని పోరాటం స్వాతంత్ర్య ఉద్యమానికి ఒక ప్రేరణగా నిలిచింది. కొమరం భీం 1901 లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో గోండుల గ్రామమైన సంగేమ్‌లో జన్మించాడు. అతను గోండు తెగకు చెందినవాడు. తన చిన్ననాటి నుంచే అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని కలిగినవాడు. భీం కుటుంబం వ్యవసాయంపై ఆధారపడింది. భూ స్వాములు, నిజాం
ప్రభుత్వం చేసిన ఆంక్షలు ఆయన కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేశాయి. గోండుల భాష గోండీ. ఆయన చిన్ననాటే తండ్రిని కోల్పోయాడు.
చిన్నతనం నుండి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావాలు పెంచుకున్నాడు. తన జీవితాన్ని ఆదివాసీలకు సహాయపడటానికి అంకితం చేశాడు. అంగ్ల భాషలో చదువు లేకపోయినా, ఆయనకు న్యాయమే ధర్మం అన్న తత్వం బాగా బోధపడింది.
నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం
ఆరంభించారు కొమరం భీం గిరిజనులపై జమీందారుల అణచివేతను ఎదుర్కొనేవాడు. నిజాం సైన్యం ఆదివాసీల పైన ఆక్రమణలు చేయడంతో, భీం ప్రతిఘటించేందుకు సిద్ధమయ్యాడు. 1920ల చివరలో భీం అటవీ ప్రాంతాల లోపలికి వెళ్ళి, అక్కడ గిరిజనులను సమీకరించి, వారిని సంఘటితంగా పోరాటానికి సిద్ధం చేశాడు.
అతను జల్(నీరు), జంగల్ (అడవి), జమీన్ (భూమి) ఈ మూడు గిరిజనుల హక్కులని పేర్కొంటూ "జల, జంగల్, జమీన్ మా హక్కులు" అనే నినాదాన్ని ప్రచారం చేశాడు. ఇది నేటికీ గిరిజన పోరాటాల్లో మార్గదర్శకంగా నిలిచే నినాదం.కొమరం భీం సాధారణ పోరాట మార్గాలను వదిలి, గెరిల్లా పద్ధతిలో పోరాటం ప్రారంభించాడు. అటవీ ప్రాంతాలను తన సైనిక శిబిరాలుగా మార్చి, అక్కడే శిక్షణ ఇచ్చి, నిజాం సైన్యం పై పోరాడాడు. ఈ పోరాటం కారణంగా ఆయనపై అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి.కొంతకాలం మహారాష్ట్ర, ఒరిస్సా ప్రాంతాలకు వెళ్ళారు.
తిరిగి తెలంగాణ ప్రాంతానికి వచ్చి పోరాటాన్ని ముమ్మరం చేశాడు. భీం తన గిరిజన సైన్యంతో సహా న్యాయం కోసం పోరాడుతూ, ప్రజల మద్దతును పొందాడు.
1940 అక్టోబర్ 27న, నిజాం సైన్యం కొమరం భీం ని రహస్యంగా అటవీ ప్రాంతమైన జొడేఘాట్ వద్ద చుట్టుముట్టి కాల్చి చంపింది. భీం మరణించినా, ఆయన ఆశయాలు గిరిజనుల్లో జీవంగా నిలిచాయి. జొడేఘాట్ ఇప్పుడు కొమరం భీం స్మారక స్థలంగా ఉంది.
కొమరం భీం యొక్క త్యాగం అనంతరం, తెలంగాణ ఉద్యమాల్లో అతని స్ఫూర్తి కనిపించింది. ఆయన పేరు మీదే "కొమరం భీం జిల్లా" ఏర్పాటు చేయబడింది. తెలంగాణ ప్రభుత్వం జొడేఘాట్‌లో అక్టోబర్ 27 ను స్మారకదినం అధికారికంగా జరుపుతోంది. అక్కడే ఆయన స్మారక స్థూపం నిర్మించబడింది.
భీం ప్రాణాలు పోసిన "జల్, జంగల్, జమీన్" అనే నినాదం నేటికీ గిరిజన హక్కుల పోరాటాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. గిరిజనుల స్వాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా కొమరం భీం గుర్తించబడ్డాడు.కొమరం భీం సాధారణ వ్యక్తి అయినా, అసాధారణ నాయకత్వ గుణాలతో ప్రజల మనసుల్లో నిలిచిపోయాడు. అన్యాయాన్ని సహించకుండా, తన ప్రాణాలను త్యాగం చేస్తూ, గిరిజనుల స్వేచ్ఛకు మార్గం చూపాడు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఈ మహానాయకుడు తెలంగాణాలోనే కాదు
భారత దేశ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచాడు.

సేకరణ
వెంకట భాను ప్రసాద్ చలసాని


.