పేరు భరద్వాజ్
అంశం హార్రర్
శీర్షిక అనగనగా ఒక దెయ్యం
చాలా ఏళ్ల కిందట మన పల్లెల్లో వీధి దీపాలుండేవి కావు. ఆ రీతిగానే చౌలమద్ది అనే పల్లెటూళ్లో కూడా వీధి దీపాలు లేవు. రాత్రి పూట ఊరు ఊరంతా చీకటిలో మునిగి ఉండేది. ఇళ్లల్లో మాత్రం ఆముదపు దీపాలుండేవి. రెండు మూడు గంటలు మాత్రమే ఆ దీపాలుంచేవారు. తొందరగా పడుకుని తెల్లవారుఝామున లేచేవారు.
అలాంటి రోజుల్లో రాత్రిళ్లు ఏడేళ్ల రాజుకు చాలా భయంగా ఉండేది. ఆ రోజుల్లోనే ఆ ఊరికి రవి సర్కారు బడికి టీచర్గా వచ్చాడు. ఒంటరివాడైన రవి రాత్రిళ్లు కొందరు పిల్లలకు చదువు చెప్పేవాడు. మంచి నీతి కథలు చెప్పేవాడు. ఆ విషయం తెల్సి రాజు, కొందరు పిల్లలతోపాటు తను కూడా ఆ టీచర్ ఇంటికి వెళ్లేవాడు. చదువుకొని అక్కడే పడుకొనేవాడు. కొత్త కాబట్టి నిద్ర సరిగా పట్టేది కాదు. భయంగా ఉండేది.
ఒకరోజు రాత్రి రాజు ఒకటికి వెళ్లాల్సి వచ్చింది. అందరూ నిద్రలో ఉన్నారు. ఎవరూ తోడు వచ్చే అవకాశం లేక రాజు ధైర్యం కూడదీసుకుని తలుపులు తెరిచాడు. ధైర్యంగా వీధి పక్కన నిలబడి దిక్కులు చూడగా అంతా చీకటిగా ఉంది. ఆకాశంలోకి చూడగా పెద్ద నక్షత్రం కనిపించింది. తల్లి చెప్పినట్టు అది తెల్లవారే సమయం. ఎక్కడలేని ధైర్యం తెచ్చుకొని, దిక్కులు చూస్తూ ఒకటికి వెళ్లసాగాడు. ఇంతలో కొంత దూరంలో ఉన్న కోమట్ల బావి మీద నల్లని ఆకారం కదిలింది. అది దయ్యం కాబోలు అనుకున్నాడు రాజు. అప్పుడే మిత్రుడు లింగం చెప్పిన దెయ్యాల కథలు గుర్తుకొచ్చాయి. ఆ దెయ్యం నీళ్ల బిందెతో తనవైపు రావడం కనిపించింది. అంతే! భయంతో లేచి ఒక్క ఉదుటున ఇంట్లోకి పరిగెత్తాడు. తలుపులు వేసి, గొళ్లెం తగిలించి వచ్చి పడుకుని నిండా దుప్పటి ముసుగేశాడు.
అయినా రాజుకు వణుకు ఆగలేదు. నిద్ర పట్టలేదు. ఎవరినీ నిద్ర లేపకుండా తూరుపు తెలతెల వారుతుంటే ఇంటికి వచ్చేశాడు. తల్లి పొయ్యి వెలిగించి వంట పనిలో ఉంది. తల్లి దగ్గరగా కూచోగా రాజుని తాకి చూసింది తల్లి. జ్వరంగా ఉండటంతో విషయం అడిగింది. రాజు భయంతో రాత్రి జరిగినదంతా వణికిపోతూ చెప్పాడు.
తల్లి వాడిని దగ్గరకు తీసుకుంది. ‘ఎందుకు బిడ్డా! భయం? దెయ్యాలూ, భూతాలూ అసల్లేవు. మీ టీచరు ఇల్లు నాకు తెల్సు కదా! కోమట్ల బావి తెల్సుకదా! అక్కడ సందులో ‘అల్లూరి రాజక్క’ ఉంటుంది కదా. ఊరంతటిలో ఆవిడే పని దెయ్యం. ఇక వేరే దెయ్యాలు లేవు. చీకట్లో తాడు కూడా పాములాగా కనపడుతుంది. నువ్వు చూసింది కచ్చితంగా ఆ రాజక్కనే. ఆవిడ చుక్కపొద్దున లేచి పని ముగించుకుని పొద్దు పొడవంగానే పొలంలో పడ్తుంది. మనలో కొందరు మనుషులు పని రాక్షసులై ఉంటారు. వారిలాగే ఈవిడ పని దెయ్యం. అంటే పని లేకుంటే తోచదు’ అంటూ ధైర్యం చెప్పింది.
అంతటితో రాజు నవ్వాడు. రాజు భయం పటాపంచలైంది. ‘వెలుగులో ఉన్నవే చీకటిలోనూ ఉన్నవి. కనుక భయం, అనుమానాలు ఉండకూడదు’ అని కూడా వాళ్లమ్మ చెప్పింది. పొయ్యిలో నుండి బూడిద తీసి రాజు నుదుట పెట్టింది. వీపు రెండుసార్లు తట్టింది. ‘వెళ్లి కాసేపు పడుకుని మరల దినం బడికి పొమ్మం’ది.
ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను
#aksharalipi#aksharalipistories
#bharadwaj
Aksharalipi Admin
Delete Comment
Are you sure that you want to delete this comment ?
Venkata Bhanu prasad Chalasani
Delete Comment
Are you sure that you want to delete this comment ?
Umadevi Erram
Delete Comment
Are you sure that you want to delete this comment ?