ఎస్.మునిసుందరం (కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు)

శింగు మునిసుందరం (సెప్టెంబర్ 14, 1937 – ఫిబ్రవరి 13, 2015) కవి, నాటకరచయిత, కథకుడు, నటుడు.
ప్రముఖ రచయిత శింగు మునిసుందరం 1937, సెప్టెంబర్ 14న చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం, పారకాల్వ గ్రామంలో లక్ష్మమ్మ, నాదమునినాయుడు దంపతులకు జన్మించారు. మునిసుందరం గారి ప్రాథమిక విద్య వీధిబడిలోను మాధ్యమిక విద్య తిరుపతిలోను నడిచింది. మెట్రిక్ నుండి ఎం.ఏ వరకు ప్రైవేటుగా చదివారు. చిన్నప్పుడు పల్లెలలో జరిగే జానపద కళల ప్రదర్శనలు చూసి కళలపట్ల అభిరుచిని ఏర్పరచుకున్నారు. మునిసుందరం గారికి 1963 లో లక్ష్మిరాజ్యం గారితో వివాహము జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు. మునిసుందరంగారు మూడు దశాబ్ధాలపాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో హిందీ అధ్యాపకుడిగా పనిచేసి విద్యారంగానికి విశిష్ట సేవలు అందించారు. ప్రిన్సిపాల్‌గా పదవీ విరమణ చేసిన ఈయన తుది శ్వాస విడిచే వరకు సాహితీ వ్యవసాయం సాగిస్తూ జిల్లా రచయితల సంఘంలో క్రియాశీల పాత్ర పోషిం చారు. మునిసుందరం గారు, రచయితలు నూతలపాటి గంగాధరం, ఎన్‌ రాజగోపాలనాయుడు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, మధురాంతకం రాజారాంలకు సమకాలీనుడు. కథలు, కథానికలు, నవలలు, నాటకాలు అనేకం రాశారు. ఈయన రచించిన నాటకాలలో ఏవిలువలకు ఏ ప్రస్థానం సుప్రసిద్దమైంది. మునిసుందరం గారు తిరుపతి కోటకొమ్మల వీధిలోని తన స్వగృహంలో ఫిబ్రవరి 13, 2015 శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు.గత కొంత కాలంగా మునిసుందరం గారు మధుమేహంతో బాధపడుతున్నారు.

నాటకం పట్ల అభిమానం పెంచుకున్న మునిసుందరం గారు మొట్టమొదట చిలుకూరు నారాయణరావు రచించిన అచ్చి నాటకంలో కథానాయికగా నటించారు. ఆ తర్వాత పల్లెపడుచు, దొంగవీరుడు, ప్రహ్లాద, కీర్తిశేషులు, అమరత్యాగి నాటకాలలో నటించి పేరు తెచ్చుకున్నారు. తన స్వంత నాటకం దేశం నీ సర్వస్వంలో హుమయూన్ పాత్ర ధరించారు. నటుడిగా అనేక బహుమతులు అందుకున్నారు.

నాటకాలు
దేశం నీ సర్వస్వం
ఇదేనా పరిష్కారం?
చరిత్రలో చిరిగినపుట
అహంబ్రహ్మ
ఇది కథకాదు
ఇచ్చట సన్మానాలు చేయబడును
సింగారం
పక్షులు
ఊరు మేలుకొంది
నిజం కాటేసింది
యువత మేల్కొంది
గుణపాఠం
నింగి నేల
శలభాలు
మాతృదేవోభవ
మహాదాత
ఏ వెలుగులకీ ప్రస్థానం?

కవిత్వం
గమనం-గమ్యం
చీకటి దీపాలు
ఒక యుద్ధం తర్వాత
అడవి పూలు
మానవతా మేలుకో
గుండెల్లోవాన
ఈ గుండె అలసిపోదు
మునిసుందరాలు

కథాసంపుటాలు
జవాబు తెలియనివాడు

మునిసుందరం గారు చిత్తూరు జిల్లా రచయితల సంఘం వ్యవస్థాపకులు. ఆ సంస్థకు 5 ఏళ్లపాటు కార్యదర్శిగా పనిచేశారు. చిత్తూరు జిల్లా సహకార ప్రచురణ సంఘానికి 3 సంవత్సరాలు అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1976 నుండి నూతలపాటి సాహితీకుటుంబం సంస్థకు కార్యదర్శిగా మరణించేవరకు వ్యవహరించారు.

ఆంధ్రప్రదేశ్ హిందీ అకాడెమీ పురస్కారం 1989లో.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 1992లో.
గరుడ పురస్కారం 2007లో.
తెలుగు థియేటర్ పురస్కారం 2010లో.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *