క్రొవ్విడి లింగరాజు ( నవంబర్ 3, 1904 – జనవరి 3, 1986) స్వాతంత్ర్య సమర యోధులు, పత్రికా సంపాదకుడు, పత్రికా రచయిత, అనువాద రచయిత, సంఘసంస్కరణాభిలాషి, రాజకీయ విశ్లేషకుడు. రాజమండ్రి పురపాలక సంఘం అధ్యక్షులుగా, శాసన సభ్యులుగా రాష్ట్రానికి, అఖిలభారత స్వాతంత్ర్య సమర యోధుల సంఘానికి ఉపాధ్యక్షులుగా దేశానికి సేవలందించారు.
లింగరాజు 1904, నవంబరు 3వ తేదీన రాజమండ్రిలో జన్మించారు. ఇతని తండ్రి సూర్యనారాయణ పడవల హెడ్గుమాస్తాగా పనిచేసేవారు. తల్లి లక్ష్మీనరసమ్మ. గాంధీ స్ఫూర్తితో కళాశాల విద్యకు స్వస్తిచెప్పి, జాతీయ ఉద్యమంలో కీలకపాత్ర వహించారు. 1922 నుండి రాజమండ్రి పట్టణ కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాడు. ఇతడు బులుసు సాంబమూర్తి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యంల అనుచరునిగా పనిచేశారు. మద్దూరి అన్నపూర్ణయ్యను ఇతడు గురువుగా భావించారు.. మద్దూరి అన్నపూర్ణయ్య సంపాదకత్వం వహించిన కాంగ్రెస్ పత్రికకు సహాయకుడిగా పనిచేశాడు. అన్నపూర్ణయ్య జైలులో ఉన్నప్పుడు ఇతడే కాంగ్రెస్ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు. ఇతడు కాంగ్రెస్ పత్రికతో పాటు వేదిక, గోదావరి పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రికలలో అనేక వ్యాసాలు వ్రాశారు. కృష్ణాపత్రికలో విదురుడు అనే కలం పేరుతో వారం వారం అనే శీర్షికను నిర్వహించారు. ఉప్పు సత్యాగ్రహం, వ్యక్తి సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం, వంటి జాతీయోద్యమాలలో చురుకైన పాత్ర పోషించారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం సాగినపుడు ఆరు నెలలు, 1930లో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు రెండున్నర సంవత్సరాలు.. ఇలా మొత్తం మీద రాజమండ్రి, వెల్లూరు, మద్రాసు, ఆలీపురం, తదితర జైళ్ళలో ఆరున్నర సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు.
మాక్సిం గోర్కీ ‘మదర్’ను ‘అమ్మ ‘గా జైలులొ ఉన్నప్పుడే అనువదించారు. ‘సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు’ పొందిన తొలి తెలుగు రచయిత. జవహర్ లాల్ నెహ్రూ రచించిన ‘ డిస్కవరీ ఆఫ్ ఇండియా ‘ ను ‘భారతదేశం’ గా అనువదించారు. గొప్పోళ్ళన్యాయం కథల సంపుటిని రచించారు. ఈయనకు 1984లో అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహీతీ సత్కారం లభించింది.
రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ హాలుకి ఆయన పేరు పెట్టారు. లింగరాజు శతజయంతి సందర్బంగా ‘స్వాతంత్య్ర యోధులు శ్రీ క్రొవ్విడి లింగరాజు శత జయంత్యుత్సవం (1904- 2004) పేరిట ఉత్సవ సమితి వారు ఒక ప్రత్యేక సంచిక కూడా వేశారు. రాజ్యలక్ష్మి మహిళా కళాశాల, ఆర్యాపురం డాక్టర్ ఏ బి నాగేశ్వరరావు పార్కులో కూడా లింగరాజు విగ్రహాలు పెట్టారు. ఆయన కుమారుడు సత్యనారాయణ మూర్తి 90 ఏళ్లకు పైగా జీవించారు. ఆయన మనుమలు భాస్కరరావు బి ఎస్ ఎన్. ఎల్. లో పనిచేసి పదవీ విరమణ చేయగా, సుబ్రహ్మణ్యం ఆర్టీసీలో పనిచేసి, రిటైరయ్యాక ‘లా’ చదివి న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ప్రతియేటా లింగరాజు పేరిట అవార్డు కూడా కుటుంబ సభ్యులు ఇస్తున్నారు.
ఇతడు నిర్వహించిన పదవులలో కొన్ని ముఖ్యమైనవి:
1938-1941 – రాజమండ్రి మునిసిపల్ ఛ్హైర్మన్
1946-1952 – రాజమండ్రి నియోజకవర్గ శాసనసభ్యుడు
1946-1947 – టంగుటూరి ప్రకాశం మంత్రివర్గంలో పార్లమెంటరీ సెక్రెటరీ
కార్యదర్శి – గాంధీ కలెక్టెడ్ వర్క్స్ కమిటీ
అధ్యక్షుడు – రాష్ట్ర స్వాతంత్ర్య సమరయోధుల సంఘం
ఉపాధ్యక్షుడు – భారత స్వాతంత్ర్య సమరయోధుల సమితి
స్థాపక అధ్యక్షుడు – శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి స్త్రీల కళాశాల
అధ్యక్షుడు – కందుకూరి వీరేశలింగం ఆస్తిక డిగ్రీ కళాశాల.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నవలలో మాగ్జిం గోర్కీ రష్యన్ భాషలో రచించిన అమ్మ ఒకటి. ఈ రచన 1906లో తొలిసారి వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కోట్ల కోట్ల ప్రతులు వెలువడుతూనే ఉన్నాయి. తెలుగునాట కూడా దాని ప్రభావం అమోఘమైంది. అమ్మ అనే మాటలో కొంతమంది సెంటిమెంటు చూస్తుంటారు గాని వాస్తవంలో అమ్మ అనేదే ఏ సెంటిమెంటూ లేని వాస్తవం. మానవాళి అస్తిత్వానికి ఆరంభ వాచకం అమ్మే. అన్ని బాధలూ, గాథలకు ప్రథమ ప్రత్యక్ష సాక్షి అమ్మే. వాస్తవానికి అమ్మ పాత సమాజానికి ప్రతీక. దాని క్రమానుగత చైతన్య పతాక. ‘అమ్మ’ పుస్తకంలోని ప్రతి పాత్రా, ప్రతి పరిణామం రచయిత మగ్జీమ్ గోర్కీ వాస్తవ జీవితంలో పరిశీలించి తెలుసుకున్నదే. 1905లో రష్యాలో తొలి విప్లవం పొడసూపింది. దాన్ని జార్ చక్రవర్తి దారుణంగా అణచివేశాడు. ఆ విప్లవమే అక్టోబరు విప్లవ విజయానికి స్ఫూర్తి. ఆ తొలి విప్లవం నుంచి వెలువడ్డ మూడు అపురూపమైన నవలల్లో గోర్కీ అమ్మ కూడా ఒకటి. ఇది తెలుగులో అమ్మ నవలకు వచ్చిన తొలినాటి అనువాదాల్లో ఒకటి. దీని ఆరోకూర్పును విజయవాడలోని ఆదర్శ గ్రంథమండలి వారు 1956లో ప్రచురించారు. దీనికి గద్దె లింగయ్య సంపాదకత్వం వహించారు.
ఇతడు 1986, జనవరి 3న తన 83వ యేట మరణించాడు.
మాధవి కాళ్ల
సేకరణ