డి.రామలింగం రచయిత. ఇతడు 1924, జూన్ 8వ తేదీన ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం మండలం, బనిగండ్లపాడు గ్రామంలో జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యం ప్రధాన విషయంగా పట్టభద్రుడయ్యాడు. ఇతనికి ఉర్దూ, హిందీ, బెంగాలీ భాషలలో ప్రవేశం ఉంది. ఇతడు 1946-48 మధ్య హైదరాబాద్ స్వాతంత్ర్య సమరంలో స్టేట్ కాంగ్రెస్ తరఫున ఉద్యమంలో పాల్గొన్నాడు. స్టేట్ కాంగ్రెస్ తరఫున సారథి పత్రికకు సహ సంపాదకుడిగా పనిచేశాడు. ఆ సమయంలో నిజాం ప్రభుత్వం సారథి పత్రికను నిషేధించింది. ఇతడు 14 నెలలపాటు అజ్ఞాతంలో ఉండి ఆ పత్రికకోసం పనిచేశాడు.తర్వాత కొంతకాలం గోలకొండ పత్రికకు పనిచేశాడు. 1952-56ల మధ్య హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వ సమాచార పౌర సంబంధాల శాఖలో పనిచేశాడు. తర్వాత కేంద్ర ప్రభుత్వశాఖలోకి మారి ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలిలో కొంతకాలం, మద్రాసులో డెప్యుటీ సెన్సార్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేసి ఆ తర్వాత పదవీ విరమణ చేశాడు. పిమ్మట హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఇతడు కేంద్ర సాహిత్య అకాడమీ సలహా సంఘ సభ్యుడిగా ఐదేళ్లు పనిచేశాడు. ఇతడు కథలు, స్కెచ్లు, రేడియోనాటికలు, సాహిత్య విమర్శక వ్యాసాలు, జీవితచరిత్రలు చాలా వ్రాశాడు.
రచనలు
ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు(జీవిత చరిత్ర)
తెలుగు కథ (సంకలనం)
ఒక తరం తెలుగు కథ (సంకలనం)
బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల(బూర్గుల రామకృష్ణారావు జీవిత చరిత్ర)
శొంఠి వెంకటరామమూర్తి జీవితచరిత్ర
ఇతని జీవితం అత్యంత విషాదంగా ముగిసింది. కడుపు నొప్పి భరించలేక, మానసిక ఒత్తిడులకు తట్టుకోలేక ఇతడు 1993, జనవరి 3వ తేదీన హైదరాబాద్ లోని హుసేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని భౌతిక కాయాన్ని మార్చురీలో ఉంచిన పది రోజులతర్వాత ఇతడిని గుర్తించి జనవరి 13న ఇతడి అంత్యక్రియలు జరిగాయి.
మాధవి కాళ్ల
సేకరణ