పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ప్రతి సంవత్సరం అక్టోబరు 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధినిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం గా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు నిర్వర్తించేవి. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్స్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్రస్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *