మహదేవ్ దేశాయ్ (భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత)

మహదేవ్ దేశాయ్ ( 1892 జనవరి 1– 1942 ఆగస్టు 15) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత. ఆయన మహాత్మా గాంధీ యొక్క వ్యక్తిగత కార్యదర్శి. ఆయన గాంధీ యొక్క బోస్‌వెల్‌ గా, ప్లాటోగా, సోక్రటీసుగా, బుద్ధగా అభివర్ణింపబడేవారు.

మహదేవ్ దేశాయ్ 1892 జనవరి 1 న గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సారస్ అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి హరిభాయి దేశాయ్ ఒక ఉపాధ్యాయుడు. ఆయన తల్లి జన్మాబెన్. జమ్నాబెన్ మహదేవ్ ఏడుసంవత్సరా వయస్సులో మరణించింది. 13 సంవత్సరాల వయసులో మహాదేవ్ దుర్గాబెన్ ను వివాహమాడారు. ఆయన సూరత్ ఉన్నత పాఠశాల, ముంబయిలోని ఎల్ఫిన్‌స్టోన్ కాలేజిలో చదివారు. ఆయన బి.ఎ పట్టభద్రుడు. ఆ తరువాత ఎల్.ఎల్.బి. చేయుటకు వెళ్లారు.

మహదేవ్ దేశాయ్ మొదటిసారి 1915 లో గాంధీని కలిసారు. ఆయన వ్రాసిన పుస్తకం (గుజరాతీ అనువాదం చేయబడిఒన జాన్ మోర్లీ రాసిన ఆంగ్ల పుస్తకం “ఆన్ కాంప్రమైజ్”) ను ప్రచురించడానికి ఉత్తమ సలహా కొరకు గాంధీని కలిసారు. దేశాయ్ 1917లో సబర్మతీ ఆశ్రమంలో ఆయన భార్య దుర్గాబెన్‌తో పాటు చేరారు.ఆ సంవత్సరం చంపారన్ ఉద్యమం జరిగింది. ఆయన డిశంబరు 13,1917 నుండి 1942 ఆగస్టు 14 వరకు ఆయన మరణించే తేదీ ముందురోజు వరకు ఒక డైరీని నిర్వహించారు.దానిలో ఆయనకు మహాత్మాగాంధీ సాన్నిహిత్యం గురించి వ్రాసారు. బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీని 1919లో అరెస్టు చేసినపుడు గాంధీజీ తన వారసునిగా దేశాయ్ ను ప్రకటించారు. దేశాయ్ మొదటిసారి 1921 లో అరెస్టు కాబడి ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు. ఆయన 25 సంవత్సరాలపాటు గాంధీజీకి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నారు. “వెర్రియెర్ ఎల్విన్” వ్రాసిన ప్రకారం “ఆయన గాంధీకి అంతకంటే ఎక్కువ. ఆయన నిజానికి గాంధీకి హోం, విదేశాంగ కార్యదర్శి. ఆయన ప్రతీ విషయాన్ని నిర్వహించేవారు. ఆన్ని యేర్పాట్లు చేసేవారు. ఆయన కార్యాలయాన్ని ఒక అతిధి గృహంగా, వంటగదిగా నిర్వహించేవారు. ఆయన అనేక మంది అథిదులను చూసేవారు. 10 సంవత్సరాల పాటు గాంధీజీ సమయాన్ని అనామక సందర్శకుల నుండి కాపాడారు.”రాజమోహన్ గాథీ మహదేవ్ దేశాయ్ గురించి: ” గాంధీజీ కంటే ముదుగా వేకువజామున లేచేవారు. గాంధీజీ నిద్రించిన తరువాత పడుకొనెవారు. గాంధీ ఒక రోజులో దేశాయ్ మూడురెట్లు గడిపేవారు – మొదటిది గాంధీకంటే ముందుగా లేవడం, రెండవది గాంధీతో నిరంతరం గడపడం, మూడవది ఆరోజు జరిగిన విషయలను డైరీలో నమోదు చేయడం.” అని వ్రాసారు.

1920 లో మోతీలాల్ నెహ్రూ తన వార్తాపత్రిక అయిన ఇండిపెండెంట్‌ను అలహాబాద్ నుండి నడపడానికి గాంధీ నుండి మహాదేవ్ దేశాయ్ సేవలను కోరాడు. ఇండిపెండెంట్ ప్రింటింగ్ ప్రెస్‌ను బ్రిటిష్ ప్రభుత్వం జప్తు చేసిన తరువాత చేతితో వ్రాసిన సైక్లోస్టైల్ వార్తాపత్రికను బయటకు తీసుకురావడం ద్వారా దేశాయ్ ఒక సంచలనాన్ని సృష్టించాడు. 1921 లో దేశాయ్‌ను తన రచనలకు ఒక సంవత్సరం కఠినమైన జైలు శిక్ష విధించారు. జైలులో, జైలు అధికారులు ఖైదీలతో దురుసుగా ప్రవర్తించడాన్ని దేశాయ్ చూశాడు. “యంగ్ ఇండియా”, “నవజీవన్‌” లలో ప్రచురించబడిన భారతీయ జైలు లోపల జీవితాన్ని వివరించే అతని నివేదిక బ్రిటిష్ అధికారులను కొన్ని కఠినమైన జైలు సంస్కరణ చర్యలను తీసుకువచ్చే దిశగా ఒత్తిడి చేసింది. దేశాయ్ 1924 లో నవజీవన్ సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. 1925 నుండి గాంధీ ఆత్మకథ, యంగ్ ఇండియాలో దాని సీరియల్ ప్రచురణకోసం ఆంగ్లంలోకి అనువాదం ప్రారంభించాడు. మరుసటి సంవత్సరం అతను సత్యాగ్రహ ఆశ్రమ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ అయ్యాడు. నవజీవన్ లో ప్రచురించిన తన వ్యాసానికి గుజరాతీ సాహిత్య పరిషత్ నుండి బహుమతిని వచ్చింది. అతను సర్దార్ పటేల్‌తో కలిసి బార్డోలి సత్యాగ్రహంలో పాల్గొన్నాడు. గుజరాతీలోని సత్యాగ్రహ చరిత్రను వ్రాసాడు. దీనిని అతను ఆంగ్లంలోకి ది స్టోరీ ఆఫ్ బార్డోలిగా అనువదించాడు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు, అతన్ని అరెస్టు చేసి జైలులో పెట్టారు. కాని గాంధీ-ఇర్విన్ ఒప్పందాన్ని అనుసరించి, జైలు నుండి విడుదలయ్యాడు. గాంధీతో కలిసి మిరాబెన్, దేవదాస్ గాంధీ, ప్యారేలాల్ లతో కలిసి రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. కింగ్ జార్జ్ V ను కలిసేందుకు వెళ్ళిన గాంధీతో పాటు వచ్చిన ఏకైక వ్యక్తి ఆయన. గాంధీ-ఇర్విన్ ఒప్పందం రద్దుకాబడి, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రతిష్ఠంభన తరువాత, గాంధీ శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాడు. వలసరాజ్యాల ప్రభుత్వ కొత్త వైస్రాయ్ లార్డ్ విల్లింగ్డన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు నిశ్చయించుకుంది. భారత జాతీయ కాంగ్రెస్, దాని కార్యకర్తలపై అదుపు చేయాలని ఆదేశించింది. 1932 లో దేశాయ్‌ను మళ్లీ అరెస్టు చేసి గాంధీ, సర్దార్ పటేల్‌తో కలిసి జైలుకు పంపారు. 1933 లో విడుదలైన తరువాత, అతన్ని తిరిగి అరెస్టు చేసి బెల్గాం జైలులో అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉన్న ఈ సమయంలోనే ఆయన “గీత ప్రకారం గాంధీ” పుస్తకాన్ని రాశాడు. ఇది అతని మరణానంతరం 1946 లో ప్రచురించబడింది. అతను 1939 లో రాక్‌కోట్‌, మైసూర్ రాచరిక రాష్ట్రాలలో ప్రజల ఉద్యమాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషించాడు. 1940 వ్యక్తిగత సత్యాగ్రహ సమయంలో సత్యాగ్రహాలను ఎన్నుకునే బాధ్యతను తీసుకున్నాడు. దేశాయ్ యొక్క చివరి జైలు శిక్ష 1942 ఆగస్టు 8 నాటి క్విట్ ఇండియా ప్రకటన తరువాత జరిగింది. అతను 1942 ఆగస్టు 9 ఉదయం అరెస్టు చేయబడ్డాడు. ఆరు రోజుల తరువాత భారీ గుండెపోటుతో మరణించే వరకు గాంధీతో పాటు అగా ఖాన్ ప్యాలెస్‌లో ఉన్నాడు. మరణించేటప్పుడు దేశాయ్‌కు 51 సంవత్సరాలు.

అతను గుజరాతీ, బెంగాలీ, ఆంగ్ల భాషలలో ప్రతిభావంతమైన రచయిత. అతను గుజరాతీలో అనువాదకుడు, రచయితగా ఎంతో గుర్తించబడ్డాడు. అతను “సంత్ ఫ్రాన్సిస్ (1934), ‘వీర్ వల్లభాయి” వంటి జీవిత కథలను రాసాడు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జీవిత్ చరిత్ర “బె ఖుడ్సి ఖిడ్మత్‌గర్” కూడా రాసాడు. బెంగాలీ నుండి, మహాదేవ్ దేశాయ్ శరత్చంద్ర చటోపాధ్యాయ (1923) లఘు కథలు, విరాజ్వాజు (1924) నవల, ఠాగూర్ రాసిన కొన్ని కవితలను ఆంగ్లం నుండి గుజరాతీలోకి అనువదించాడు. 1936లో నెహ్రూ జీవిత కథను రాసాడు. గాంధీ ఆత్మకథ,” ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ట్రూత్”ను గుజరాతీ నుండి ఆంగ్ల అనువాదం కూడా చేసాడు. గాంధీ ప్రచురణలైన యంగ్ ఇండియా, నవజీవన్, హరిజన్‌ భంధులకు ఆయన క్రమం తప్పకుండా సహకరించారు. అతను రాసిన డైరీలను 19 సంపుటాలుగా “మహదేవ్‌భని డయరి” పేరుతో ప్రచురించాడు. నరహరి పరిఖ్, చందుభాయ్ భగభాయ్ సంపాదకీయం చేసిన ఇవి గాంధీ జీవితాన్ని నిశితంగా పరిశీలించేటట్లు చేస్తాయి. గాంధీ జీవితంలో, భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో జరిగిన ప్రధాన సంఘటనల యొక్క విలువైన చరిత్ర ఇందులో ఉంది.

అఖిల భారత వార్తాపత్రిక సంపాదకుల సదస్సు వ్యవస్థాపక సభ్యులలో దేశాయ్ ఉన్నాడు. ప్రెస్, బాంబే క్రానికల్, హిందూస్తాన్ టైమ్స్, ది హిందూ, అమృత బజార్ పత్రిక వంటి వివిధ జాతీయవాద భారతీయ వార్తాపత్రికలకు ఆయన తరచూ సహకరించాడు.

మహదేవ్ దేసాయ్ గుండెపోటుతో ఆగస్టు 15 1942 న ఉదయం గాంధీతొ కలసి అగాఖాన్ పాలెస్ లో ఉన్నప్పుడు మరణించారు. దేశాయ్ శ్వాస ఆగిపోయినపుడు గాంధీజీ ఆందోళనతో యిలా అన్నారు: “మహాదేవ్! మహాదేవ్!” అని పిలిచాడు. తరువాత ఎందుకు యిలా చేశావని అడిగాడు. గాంధీజీ ఈ విధంగా సమాధానమిచ్చాడు: “మహాదేవ్ కళ్ళను తెరిచి నన్ను చూస్తాడని అనుకుంటున్నాను, ఆయనకు నేను లేవమని చెప్పాను. ఆయన జీవితంలో నా మాటను ఎన్నడూ బేఖాతరు చేయలేదు.నేను చెప్పిన మాటలు ఆయన వింటున్నాడని నా విశ్వాసం,ఆయన మరణాన్ని ఉల్లంఘించి వస్తే బాగుండేది.”గాంధీజీ స్వయంగా దేశాయ్ శరీరానికి స్నానం చేయించాడు. ఆ పాలెస్ మైదానంలో ఆయనను దహనం చేసారు. ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఆయన సమాధి ఉంది.

భారత తపాలా శాఖ ఆయనపై గౌరవార్థం 1983లో తపాలా బిళ్ళపై ఆయన బొమ్మను ముద్రించింది. ఆయన కుమారుదు నారాయణ దేశాయ్ కూడా గాంధేయవాదిగా ప్రసిధ్దుడు, రచయిత. ఆయన మహాదేవ్ దేశాయ్ జీవిత చరిత్రను “ద ఫైర్ అండ్ రోస్” అనే నామంతో వ్రాసారు. మహదేవ్ దేశాయ్ గౌరవార్థం ఆయన పేరుతో మహదేవ్ దేశాయ్ సమాజసేవ మహావిద్యాలయ, గురజాత్ విద్యాపీఠ్ యొక్క సైన్స్, ఆర్ట్స్ విభాగం ఆయన పేరుతో నామకరణం చేసారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *