సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు. సామాన్యుడికి ఏ ఆఫీసుకు వెళ్ళినా పనిచేయించుకోవటం, తనకు కావలసిన సమాచారాన్ని రాబట్టటం కష్టతరమైన నేపథ్యంలో భారత ప్రభుత్వం 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈ చట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 17 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి. సమాచార హక్కు చట్టంలో మెుత్తం 6 అధ్యాయాలు, 31సెక్షన్లు ఉన్నాయి.

రికార్డులు, పత్రాలు, మెమోలు, ఈ మెయిళ్లు, అభిప్రాయాలు, సలహాలు, పత్రికా ప్రకటనలు, సర్క్యులర్లు, ఉత్తర ప్రత్యుత్తరాలు, లాగ్ పుస్తకాలు, ఒప్పందాలు, నివేదికలు, నమూనాలు, తనిఖీ రికార్డులు మొదలైనవి. ఈ సమాచారం ఎలక్ట్రానిక్ రూపంలోనైనా వుండవచ్చు. ఉదాహరణకు,

రేషన్ డీలరు కార్డులు, అమ్మకాల వివరాలు
ప్రాథమిక ఆరోగ్యకేంద్రము వార్షిక నిధులు, ఖర్చులు, లబ్ధిదారుల వివరాలు
ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులు, వారికి అందిన సహాయం
జిల్లా ప్రజా ప్రతినిధులు (ఎంపీ, శాసన సభ్యులు) నియోజకవర్గ అభివృద్ధి నిధులు వినియోగపు వివరాలు
ఎన్నికల కమిషనర్‌ కార్యాలయంనుండి వివరాలు
‘ప్రభుత్వ ఉద్యోగుల ఆస్తుల వివరాలు
ఏ ప్రభుత్వ యంత్రాంగము వద్దనున్న సమాచారమునైనను సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము 2005 కల్పించుచున్నది. అంటే, సదరు సమాచారమును కలిగిన పనులు, పత్రాలు, రికార్డులు తనిఖీ చేసేందుకు, వాటి యొక్క నోట్సు తీసుకొనేందుకు, ధ్రువీకృత ప్రతులు పొందేందుకు, ఏదైనా పదార్ధము యొక్క ధ్రువీకృత నమూనాలు పొందేందుకు, కంప్యూటర్ లేదా ఏదైనా పరికరములో నిక్షిప్తము చేయబడిన సమాచారమును డిస్కెట్లు, ప్లాపీలు, టేపులు, వీడియో కేసెట్లు లేదా ఏ ఇతర ఎలక్ట్రానిక్ రూపములో గాని లేదా వాటి ప్రింట్లు గాని పొందేందుకు లేదా సమాచారమును సేకరించుకొనే హక్కును సమాచార హక్కు చట్టము అందుబాటులోకి తెచ్చింది.

ప్రభుత్వం, న్యాయ, శాసన వ్యవస్థల సంస్థలు, ప్రభుత్వం ఇచ్చే పాక్షిక నిధులతో నడిచే సంస్థలు పౌరులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలి. అంటే జిల్లాపరిషత్ లు, పురపాలక సంఘాలు, గ్రామపంచాయితీలు, కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, ఇతర రెవెన్యూ అధికార కార్యాలయాలు, విద్యాశాఖ, పౌరసరఫరాల శాఖ, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ బ్యాంకులు, సంస్థలు మొదలైనవన్నింటికి ఈ చట్టం అన్వయిస్తుంది. కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వం నిర్దేశించిన భధ్రతా లేక గూఢచార సంస్థలకి మినహాయింపు ఉంది. అయితే, అవినీతి ఆరోపణలు , మానవ హక్కుల అతిక్రమణలకు సంబంధించిన సమాచార విడుదల సందర్భములో ఈ మినహాయింపు వర్తించదు. ఈ చట్టము క్రింద కొన్ని నియమాల క్రింద సమాచారమును ఇచ్చేందుకు మినహాయింపు ఉంది. అయితే, వాటిలో బహుళ ప్రజా ప్రయోజనము దృష్ట్యా సమాచారము ఇచ్చేందుకు కూడా అవకాశము ఉంది.

సమాచారం ఇచ్చేందుకు చట్టంలో నిర్దేశించిన రుసుం మినహా ఇతరత్రా ఎలాంటి అదనపు ఫీజు దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయకూడదని సమాచార ప్రధాన కమిషనర్‌ తేల్చి చెప్పారు. సాధారణంగా దరఖాస్తు రుసుం 10 రూపాయలు వసూలు చేయాలి. ఇది కాక ముద్రణ రూపంలో సమాచారాన్ని ఇస్తే ప్రతి పేజీకి రూ. 2 చొప్పున ఫోటోస్టాట్‌ ఖర్చుల్ని కూడా వసూలు చేయవచ్చు.కొన్ని ప్రత్యేక కేసుల్లో మాత్రం దీనికి మినహాయింపు ఉంటుందని సమాచార కమిషనర్‌ పేర్కొన్నారు. ప్రత్యేకంగా పుస్తకాలు, మ్యాప్‌లు, ప్లాన్లు, డాక్యుమెంట్లు సమకూరిస్తే ఇందుకు సంబంధించిన రుసుంను దరఖాస్తుదారుడి నుంచి వసూలు చేయవచ్చు. అలాగే సమాచారాన్ని తపాలా ద్వారా పంపితే అందుకయ్యే ఖర్చుల్ని కూడా దరఖాస్తుదారుడే చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వాధికారులు, ఉద్యోగుల ఆస్తి పాస్తుల వివరాలు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులకు తప్పనిసరిగా ఇవ్వాలి.ఆలిండియా సర్వీసుల (విధుల నిర్వహణ) చట్టం -1968 లోని 16వ నిబంధన ప్రకారం ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్., ఐ.ఎఫ్.ఎస్ అధికారులు తమ స్థిరాస్తుల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. అధికారుల ఆస్తివివరాల గురించి సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్, న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తీర్పులిచ్చింది.

దరఖాస్తు స్వీకరించక పొయిన, నిర్ణీత సమయములో సమాచారము ఇవ్వక పొయిన, దుర్బుద్ధితో నిరాకరించినా, తెలిసి తప్పు సమాచారం ఇచినా, మరే విధంగానైన ఆపిన రోజుకు 250 రూపాయలు జరిమాన విధించాలని సెక్షన్ 20 చెపుతుంది.

దరఖాస్తు రుసుం నగదు రూపంలో కూడా చెల్లించడానికి స.హ.చట్టం అవకాశం కల్పిస్తున్నా దరఖాస్తు తిరస్కరణతో చట్టాన్ని చట్టుబండలు చేస్తున్నారు.
అధికారులు తాము ఇవ్వదలచుకున్న సమాచారాన్నే ఇస్తున్నారు. స్పష్టంగా అడిగినా కోరిన సమాచారాన్ని ఇవ్వడం లేదు.
అడిగిన సమాచారంతో పాటు ఆ సమాచారం సకాలంలో పొందే హక్కు సమాచార హక్కు చట్టం కల్పించింది. దరఖాస్తు చేయడంలో లోపాలను, అస్పష్టతను ఆసరాగా తీసుకుని అధికారులు నెలల తరబడి తిప్పించుకుంటున్నారు.
సుపరిపాలన కేంద్రం సహకారంతో చేసే ప్రయత్నాలు వెబ్‌సైట్‌కే పరిమితమయ్యాయి.పూర్తిస్థాయిలో దరఖాస్తు నింపలేదని, సరైన సమాచారం అందులో పేర్కొనలేదని 65 శాతం దరఖాస్తులను ముందుగానే తిరస్కరిస్తున్నారు.
సమాచారం ఇవ్వడం ఇష్టంలేని అధికారులు కమిషన్ ముందు కూడా డొంక తిరుగుడు సమాధానాలతో సహనపరీక్ష పెడుతున్నారు. సమాచారం ఇస్తామని విచారణ సమయంలో అంగీకరించి తర్వాత మొండికేస్తున్నారు.
అప్పీల్ చేస్తే షోకాజ్ నోటీసులిచ్చి రెండోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఒకప్పటి కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ వజహత్ హబీబుల్లా అభిప్రాయాలు:

ఏ రాష్ట్రమూ ఈ చట్టాన్ని సరిగ్గా అమలు చేయడం లేదన్నారు. అప్పీళ్ల విషయంలో చురుగ్గా వ్యవహరించే కొందరు కమిషనర్ల పర్యవేక్షణలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో సమాచార హక్కు చట్టం మెరుగ్గా అమలు అవుతోంది.పాత్రికేయులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే పరిశోధనాత్మక జర్నలిజానికి పూనుకోవాలి.
చట్టం గ్రామ స్థాయి వరకు వెళ్లలేదు. గ్రామీణ ప్రజల నిరక్ష్యరాస్యత, మీడియా ఎక్కువగా పట్టణాలకే పరిమితం కావడం ఇందుకు కారణాలు. సమాచార చట్టంపై గ్రామీణుల్లో అవగాహన పెరగాలి. అప్పుడే వారికి ఇతర చట్టాలపైనా అవగాహన పెరుగుతుంది. గ్రామీణులు ఎవరైనా సమాచారం అడిగితే పంచాయతీ అధికారులు ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసివ్వాలి.
దరఖాస్తు చేసిన 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలన్న గడువును కుదించాల్సిన అవసరం లేదు. పూర్తి సమాచారం అందివ్వాలంటే ఆమాత్రం సమయం అవుతుంది. తగ్గిస్తే అధికారులు ఒత్తిడిలో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉంది.
సమాచార కమిషన్లు విశ్రాంత ఐఏఎస్ అధికారులకు పునరావాస కేంద్రాలుగా మారుతున్నాయన్న ఆరోపణ నిజమే. కానీ, నాలుగైదు శాఖల్లో 20 ఏళ్లకు పైగా పనిచేసిన అధికారులే సమాచారాన్ని సకాలంలో ఇవ్వలేకపోతే ఇతరులు ఇవ్వడం కాస్త కష్టమే. హక్కుల ఉద్యమకారులు అడుగుతున్నట్లు న్యాయమూర్తులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, పాత్రికేయులను నియమిస్తే మరింత పారదర్శకత ఉంటుంది.
పీఐవోలు, అప్పిలేట్ అధికారుల్లో అవగాహన పెరగకపోవడానికి సమాచార అధికారికి దస్త్రాలు నమోదు చేయడం, వాటిని కార్యాలయాల్లో ప్రదర్శించడానికే సమయం సరిపోతోంది. కిందిస్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వలేకున్నారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *