అంశంఅక్షరలిపి ప్రేమలేఖల పోటీ

శీర్షిక
శకుంతల దుష్యంతునికి వ్రాసిన ప్రేమలేఖ.

ప్రియమైన దుష్యంత మహారాజా,

ఈ కనువిందు చేసే ఆశ్రమ వన మధ్యలో కూర్చుని నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నీ స్మృతులే నా మనసుని మృదువుగా తాకుతున్నాయి. నీవు వెళ్లిపోయిన నాటినుంచి నాకు ప్రతి పువ్వులో నీ నవ్వు, ప్రతి గాలిలో నీ మాటల ప్రతిధ్వని వినిపిస్తున్నాయి.
రాజసభల వెలుగు నీకు సహజమని తెలుసు, కాని అరణ్య నిశ్శబ్దంలో నా హృదయం మాత్రం నీ పేరునే జపిస్తోంది. నీవు పలికిన ఆ స్నిగ్ధ వాక్యాలు, చూపిన ఆ అపూర్వమైన స్నేహం ఇవన్నీ నా జీవితానికి అర్థం కలిగించాయి.

నీ చేతి స్పర్శలో భద్రతను, నీ చూపులో విశ్వాసాన్ని నేను చూశాను. రాజా, ప్రేమ అనేది క్షణికమైన భావం కాదు.అది ఆత్మల మధ్య బంధం. ఆ బంధాన్ని నీవు మరచిపోవని నా నమ్మకం.

ఈ శకుంతల హృదయం నీకే అంకితం. కాలం పరీక్షించినా, విధి ఆటలాడినా కూడా నా ప్రేమ మాత్రం అచంచలంగా నీ వైపే ఉంటుంది. నీవు తిరిగి వచ్చి నీ బాస నిలుపుకుంటావు అని ఆశిస్తూ.

నీ శకుంతల

రచయిత
వెంకట భాను ప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *