వడ్డెర చండీదాస్ (నవంబర్ 30, 1937 – జనవరి 30, 2005) ప్రముఖ తెలుగు నవలా రచయిత, తాత్వికుడు.
వీరు 1937 నవంబర్ 30 న కృష్ణాజిల్లా, పామర్రు మండలం, పెరిశేపల్లి గ్రామములో వ్యసాయదారుల కుటుంబంలో జన్మించారు. వీరి అసలు పేరు డాక్టర్ చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు (సి. ఎస్. రావు). తన కలంపేరులో “వడ్డెర”ను పేద వృత్తికులమైన వడ్డెర ప్రజల నుండి, చండీదాస్ అన్న పేరును 15వ శతాబ్దపు విప్లవాత్మక బెంగాలీ కవి నుండి స్వీకరించాడని కథనం. చండీదాస్ తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయములో తత్త్వశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేసి విరమించారు. ఇతని నవలలో హిమజ్వాల, అనుక్షణికం, చీకట్లోంచి చీకటిలోకి, ప్రేమతో ప్రముఖమైనవి. చైతన్య స్రవంతి కథన రీతిని ఎంచుకుని రాసిన చండీదాస్ రచనలు విశేష ప్రజాదరణ పొందడమే కాకుండా సాహిత్యవేత్తల మన్ననలు కూడా పొందాయి.
హిమజ్వాల
ఇది వడ్డెర చండీదాస్ తొలి నవల. మంచులా చల్లబడిపోయిన తెలుగు పాఠకుల మనసులో మంటలు రగిలించిన నవల హిమజ్వాల. ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి విపరీతమైన సంచలనాన్ని సృష్టించింది. నాటకీయత, కథనా నైపుణ్యం, చైతన్య స్రవంతి అద్భుతంగా మేళవించిన రచన ఇది. కృష్ణ చైతన్య, గీత అనే రెండు ముఖ్యపాత్రల అంతరంగ చిత్రణ ఈ నవలలో అద్భుతంగా జరిగింది.
అనుక్షణికం
దీని రచనాకాలం 1979-81, కథాకాలం 1971-80. రెండు వందలు పైగా పాత్రలు, కోకొల్లుగా సంఘటనలతో ఒక దశాబ్దపు దేశ రాష్ట్ర చరిత్రలను కూర్చి సృష్టించిన నవల ఇది. ఇందులో ఘటనలన్నీ నిజాలు, చారిత్రికాలు. ఈ నవలలో మరొక విశేషం – తెలుగు నవలా సాహిత్యంలో ఎన్నడూ లేని వాస్తవికత. కులాల పేర్లు, ఇంటి పేర్లు, ఊళ్ళపేర్లు చిరునామాలతో సహా పేర్కొనడం.
ఆంధ్రజ్యోతి వార పత్రికలో ధారావాహికగా వెలువడి రెండు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో ఎందరినో మెప్పించిన నవల ఇది.
చండీదాస్ 2005, జనవరి 30 న విజయవాడలోని నాగార్జున ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
మాధవి కాళ్ల
సేకరణ