పి. కేశవ రెడ్డి(తెలుగు నవలా రచయిత)

డా. పి. కేశవరెడ్డి (1946 మార్చి 10 – 2015 ఫిబ్రవరి 13) తెలుగు నవలా రచయిత, వైద్యుడు. ఆయన రాసిన ఎనిమిది నవలలు పాఠకుల ఆదరణ పొందాయి. కొన్నినవలలు హిందీలోకి తర్జుమా కాగా, ఇంగ్లీషులో మాక్మిలన్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి ప్రముఖ ప్రచురణ సంస్థలు ప్రచురించాయి. రచయితగా కేశవరెడ్డి ఏ వాదాలతోనూ, ఉద్యమాలతోనూ సంబంధం ఉన్నవాడు కాదు. అవేవీ లేకుండా తన పాఠకవర్గాన్ని సృష్టించుకున్న రచయిత డాక్టర్‌ కేశవరెడ్డి. కేశవరెడ్డి అణగారిన ఎరుకలకు, యానాదులకు, మాలలకు రెక్కలు ముక్కలు చేసుకున్నా కడుపు నిండని బక్కిరెడ్డి వంటి కాపోనికి, బతుకు భారమై నూతిని, గోతిని వెతికే సమస్త కులాల కష్టజీవులకు, వ్యథార్త జీవులకు కావ్య గౌరవం కలిగించి వారి జీవిత కదనాన్ని కథనంగా మలిచి పాఠకుడి ముందు నిలిపిన రచయిత కేశవరెడ్డి.

పెనుమూరు కేశవరెడ్డి 1946 మార్చి 10 న చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లెలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తరువాత, నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి లోని విక్టోరియా ఆస్పత్రిలో వైద్యునిగా పనిచేస్తూ అక్కడే స్థిరపడిపోయారు.

ప్రముఖ రచయిత మధురాంతకం రాజారామ్ కేశవరెడ్డి గురించి ఇలా అంటారు: “కేశవరెడ్డి తల్లి పుట్టినూరు మావూరే. అంతటి రచయితను కన్న తల్లి మావూరి ఆడపడుచే కావడం నాకు గర్వకారణం”. మధురాంతకం రాజారామ్‌కు తాను ఏకలవ్యశిష్యుణ్ణని కేశవరెడ్డి చెప్పుకున్నాడు.

గ్రామీణ సమాజపు రూపు రేఖలను, అంతః సంఘర్షణలను లోతుల్లోకి వెళ్లి చిత్రీకరించిన రచయితగా, దళితులు, గిరిజనులు, స్రీలు, అణచివేతకు గురయ్యే సమూహాల పట్ల సంవేదనతో రచనలు చేసిన ప్రగతీశీల రచయితగా కేశవ రెడ్డి గుర్తింపు పొందాడు. అతడు అడవిని జయించాడు, మునెమ్మ, మూగవాని పిల్లనగ్రోవి, శ్మశానం దున్నేరు, సిటీ బ్యూటీఫుల్‌, చివరి గుడిసె, రాముండాడు రాజ్జముండాది, ఇన్‌ క్రెడిబుల్‌ గాడెస్‌ వంటి ఎన్నో రచనలను కేశవరెడ్డి తెలుగు సమాజానికి అందించారు.

కేశవరెడ్డి తీసుకున్న ఇతివృత్తాలు చాలా క్లిష్ట మైనవి. ఒంటిల్లు అనే గ్రామ కేంద్రంగా నెలకొన్న వర్ణవ్యవస్థను, వర్గాన్ని భూస్వామ్యాన్ని దాని నిజస్వరూపాన్నీ బట్టబయలు చేసిన రచన కేశవరెడ్డిది. కేశవరెడ్డి రచనలకు నక్సల్బరీ, ఆదివాసి, రైతాంగ పోరాటాలు ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఆయన రచనల్లో ఉద్యమాల ప్రస్తావన నేరుగా వుండదు. అయితే వాటి ద్వారా సమాజం ముందుకు వచ్చిన వైరుధ్యాలను కళాత్మకంగా చెప్పడం ఉంటుంది. కేశవరెడ్డి ఇటీవల రైతాంగ స్త్రీ ఇతివృత్తంగా రాసిన మునెమ్మ ఇందుకు దాఖలాగా నిలుస్తుంది. ఆయన పశ్చిమ దేశాల సాహిత్యంతో ప్రగాఢ పరిచయం కలిగినవారు, ప్రభావితమైన వారూను. కేశవరెడ్డి పైన హెమింగ్వే, స్టెయిన్‌బాక్‌, విలియం ఫాక్‌నీర్‌వంటి రచయితల ప్రభావం ఉన్నది.

కేశవరెడ్డి సృష్టించిన మన్నుగాడు, రంపాల రామచంద్రుడు, బైరాగి, అర్జునుడు వంటి పాత్రలు, వ్యవస్థ భిన్నరూపాలలో విధించే కట్టుబాట్లను ధిక్కరించి తమదయిన జీవిత పథాన్ని ఎంచుకుని స్వేచ్ఛాన్వేషణలో, ఆత్మగౌరవంతో బతికిన వాళ్లు.

రచనలు
మూగవాని పిల్లనగోవి – 1996
చివరి గుడిసె – 1996
అతడు అడవిని జయించాడు – 1984
క్షుద్ర దేవత (ఇంక్రెడిబుల్ గాడెస్) – 1979
శ్మశానం దున్నేరు – 1979
సిటీ బ్యూటిఫుల్ – 1982
రాముడుండాడు – రాజ్యముండాది – 1982
మునెమ్మ – 2008
బానిసలు – భగవానువాచ – రెండు పెద్ద కధల సంకలనం – 1975
మూగవాని పిల్లనగోవి: బల్లార్డ్ ఆఫ్ ఒంటిల్లు – 2013.

2015, ఫిబ్రవరి 13 న నిజామాబాద్ లో ఆనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *