కొండూరు వీరరాఘవాచార్యులు(తెలుగు సాహితీవేత్త, పండితుడు)
కళాప్రపూర్ణ ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పండితుడు. రాఘవాచార్యులు శాస్త్ర పాండిత్యంతో పాటు కవితా సంపదను, ప్రాచీన సంప్రదాయాలతో పాటు ఆధునికరీతులను, సమపాళ్లలో మేళవించుకున్న సాహితీవేత్తలలో దర్శనాచార్య బిరుదాంకితుడైన ఆచార్య కొండూరు వీరరాఘవాచార్యులు ఒకరుగా చెప్పుకోవచ్చు. ఈయన అనేక గద్య, పద్య రచనలు చేసి, ఆచార్యులుగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహితీ ప్రపంచానికి చిరపరిచితులు. వీరరాఘవాచార్యులు 1912, సెప్టెంబరు 26కు సరియైన పరీధావి నామ సంవత్సర భాద్రపద పూర్ణిమ, గురువారం నాడు గుంటూరు జిల్లా, తెనాలి మండలంలోని, కోపల్లె గ్రామంలో జన్మించాడు. పార్వతమ్మ, కోటీశ్వరాచార్యులు ఇతని తల్లిదండ్రులు. ఈయన తెనాలిలోని సంస్కృత కళాశాలలో త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి వద్ద విద్యను అభ్యసించి 1936లో ఉభయభాషా ప్రవీణుడైనాడు. ఈయన బాల్యంలోనే శిల్పకవితా కళలతో పాటు యోగ, వేదాంతంలలో శిక్షణ పొందాడు. గుంటూరులోని శారదానికేతనం, కావలి, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లిలోని శరభయ్య హైస్కూలు మొదలైన ఉన్నతపాఠశాలలలో సంస్కృతాంధ్ర పండితుడిగా పనిచేశాడు. తర్వాత తెనాలిలోని వి.యస్.ఆర్…